ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘వార్ 2’ చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ఇదిలావుంటే.. ఈ సినిమాపై బీటౌన్లో ఆసక్తికరమైన ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. వివరాల్లోకెళ్తే.. ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఎన్టీఆర్ రెండు పాత్రలూ ఒకదానితో ఒకటి పోరాడతాయని తెలుస్తున్నది. ఈ కథలో ఇదే హైలైట్ అని సమాచారం.
కథ రీత్యా ఇందులో హృతిక్ కంటే ఎన్టీఆర్కే ఎక్కువ ప్రాధానత్య ఉంటుందని బాలీవుడ్ కోడై కూస్తున్నది. అయితే.. బాలీవుడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమ హీరోని తక్కువ చేసుకోవడం జరిగే పనికాదని, అలాగని తెలుగు రాష్ట్రాల్లో తారక్ వల్ల వచ్చే భారీ బిజినెస్ని కూడా తక్కువ అంచనా వేయకూడదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఈ ఏడాది ఆగస్ట్ 14 దాకా ఆగాల్సిందే.