సంగారెడ్డి, జనవరి 03: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో 2030 నాటికి రెండు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తోందని తెలిపారు. కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండ్రోజుల వర్క్షాప్ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్తో సింగరేణి ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్రని, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ఆధునిక దేవాలయాలైన ఐఐటీలకి అంకురార్పణ చేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఫ్లోటింగ్ సోలార్పై పెట్టుబడులు పెడుతామని, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తెలంగాణను మారుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంగారెడ్డికి ఐఐటీ వచ్చిందని భట్టి గుర్తు చేశారు. వైఎస్ రాజకీయ నేతే కాదు.. విజన్ ఉన్న గొప్ప నాయకుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు.










