ఐక్యతతో వడ్డెరులు హక్కులు సాధించుకుందాం

హైదరాబాద్, జనవరి 02: సంచార, శ్రమ జీవులైన వడ్డెరలను దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎస్ సి లుగా, ఎస్ టి లుగా పరిగణిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా తమని గిరిజన తెగల (ఎస్ టి)లో చేర్చాలని, వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిలభారత వడ్డెర, వోడ్, బోవి, బేల్దార్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వడ్డెరల రాష్ట్ర సదస్సు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, దేశోద్దారకభవన్ లో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఎంబిసి చైర్మన్ జెరిపాటి జైపాల్, అఖిలభారత వడ్డెర, వోడ్, బోవి, బేల్దార్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షరాలు వేముల తిరుమల దేవి, ప్రధాన కార్యదర్శి గుంజ రేణుక, యువజన విభాగం జాతీయ అధ్యక్షులు మంజల రమేష్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మంచపు రమ తదితరులు ప్రసంగించారు.

ఎంబిసి చైర్మన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలలో వడ్డెర్లకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం వడ్డెరలంతా ఐక్యతతో పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వడ్డెరలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా, ఇతర సామాజిక వర్గాలకు ఇస్తున్న మాదిరిగా బీమా, రాయితీలు తదితర సదుపాయాలు కల్పించే విషయాలను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించుకునేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్ మాట్లాడుతూ.. వడ్డెరలను ఎస్ టి జాబితాలో చేర్చేందుకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. వడ్డెర కాంట్రాక్టర్ల కోసం కో- ఆపరేటివ్ సోసైటీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్ను ప్రస్తుతం 3 శాతానికి (వడ్డెరలు, సగరలు కలిపి) కుదించారని, దానిని యధావిధిగా 15 శాతానికి పెంచాలని కోరారు.

వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐ ఎన్ టి యు సి తెలంగాణ అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వడ్డెర్లు, ఎరుకుల, యానాది, లంబాడీలు, డి.ఎన్.టి సంచార జాబితాలో ఉన్నారని, 1970లో అనంతరం ఏర్పడిన కమిషన్ ఎరుకుల, యానాది, లంబాడీలను, ఎస్.టి (గిరిజన తెగలు) లో చేర్చి, లిపి లేని కారణంగా వడ్డెరులను బిసి ఎ లో చేర్చి వడ్డెర్లకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల జనాభా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశారన్నారు. అలాగే కాంట్రాక్టులలో సొసైటీలకు సాల్వెన్సి లేకుండా క్లాస్2 వరకు రిజిస్ట్రేషన్స్ చేయాలని, ఇఎండి లేకుండా ప్రభుత్వరంగ సంస్థలలో 25 శాతం రిజర్వేషన్ పనులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

50 ఏళ్లు నిండిన వడ్డెరలకు నెలకు రూ.4 వేల ఫించన్ ఇవ్వాలని, మైనింగ్ లో వడ్డెర కో-ఆపరేటివ్ సోసైటీలకు 30 శాతం రిజర్వేషన్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మైనింగ్ క్వారీలపై విచారణ జరిపి వారి లైసెన్స్ రద్దు చేసి వడ్డెరలకు రావలసిన వాటాను వెంటనే ఇప్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంజల హనుమయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు సాతల గోపాల్, ప్రధాన కార్యదర్శి ఇడగోటి నగేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఇడగోటి పార్వతి, యువజన అధ్యక్షులు బొంత చిరంజీవి, యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బోదాసు శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు రేపన్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News