విజయవాడ, డిసెంబర్ 30: కొత్త సంవత్సరానికి ఆహ్వానం, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికే 31న రాత్రి నగరంలో ఆంక్షలు విదిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకునే వారు పశ్చిమ బైపాస్ పైకి వెళ్లవద్దని స్పష్టం చేశారు. నగరంలోని బెంజ్ సర్కిల్ రెండు ఫ్లై ఓవర్లు, పీసీఆర్ వద్ద ఉన్న ప్లై ఓవర్, కనకదుర్గ ్గªª`ల ఓవర్ను పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. అలాగే ఎంజీ రోడ్డు. ఏలూరు రోడ్డు, బీఆర్జీఎస్ రహదారులను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల మేరకు.. రహదారులపై అర్ధరాత్రి వేడుకల నిర్వహణపై నిషేధం విధించారు. రాత్రి 11 గంటల తర్వాత వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించకూడదు. మద్యం తాగి వాహనాలు నడపకూడదు. గుంపులుగా రహదారులపైకి చేరి కేక్స్ కట్ చేయడం నిషేధం. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా ఉంటాయి. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసి అధిక శబ్దాలు చేసుకుంటూ ప్రమాదకర విన్యాసాలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. హెల్మెట్ లేకుంటే ప్రకాశం బ్యారేజీపైకి నో ఎంట్రీ. హెల్మెట్ లేకుండా వాహనదారులను ప్రకాశం బ్యారేజీ పైకి అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నిబంధన సోమవారం నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. హెల్మెట్ లేక అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.