హైదరాబాద్, డిసెంబర్ 28: అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరిశీలించారు. నిర్మాణం పూర్తి చేసి ఏడెనిమిది నెలలు అయినా ఇంకా ప్రజలకు వైద్య సేవలు అందక పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో ప్రారంభించేలా చూస్తానని స్థానికులకు ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పేదలకు మంచి వైద్యం అందించేదని, కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా.. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అని భావిస్తే.. బిల్డింగ్ పూర్తి చేసి ఎనిమిది నెలలు గడిచిన నిర్మాణం తాలుకు డబ్బులు రాలేదని కాంట్రాక్టర్ తాళాలు వేసుకోవడంతో అనేక నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని వాపోయారు.
గతంలో ఈ ఆసుపత్రి ఎన్నో సేవలందించిందని నేడు ఎందుకిలా ఉండిపోవాలసి వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ పట్టింపులు, కాంట్రాక్టు బిల్లులు రాకపోవడం, పెద ప్రజల వైద్యంపట్ల నిర్ధిష్టమైన విధానం లేకపోవడం, పట్టింపు లేకపోవడం ఒకింత బాధ కలిగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపిట వేస్తుందని చెబుతున్న పెద్దలు ఇలాంటి ఆసుపత్రుల విషయం లో ఏమి చెపుతారని నిలదీశారు. ఈరోజే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తో మాట్లాడి దీనిని వెంటనే ప్రారంభోత్సవం చేసే ఏర్పాటు చేస్తాను. స్టాఫ్ ను సంపూర్ణంగా నియమించి, వైద్య పరికరాలు తెప్పించి, పేద ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వి. కె. మహేష్ ముదిరాజ్, చింతల మాణిక్య రెడ్డి, ఇతర నాయకులు, మహిళా ప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.