మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల అయ్యన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేసిన దూరదృష్టి నాయకత్వం, విశాల దృష్టితో వ్యవహరించిన ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పటికీ దేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతారు. ఆయన నిశ్శబ్దం శక్తిగా మారిన గొప్ప నాయకుడు. ఆయన సద్విద్వానికి, నిబద్ధతకు ఈ జన్మంతా భారతదేశం రుణపడి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పేర్కొన్నారు.
