హైదరాబాద్, డిసెంబర్ 27 : సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతాడని, అందులో భాగంగానే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాడని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని కవిత అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల జనాభా ఎంతో తెలికుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని చెప్పారు.
కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు.
సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని విమర్శించారు.