ముంబయి, డిసెంబర్ 26: రాబోయే ఐదేళ్లలో టాటా గ్రూప్సంస్థల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. తయారీ రంగంలో త్వరలో భారత్లో స్వర్ణయుగం రాబోతోందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాటరీలు, సెమి కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సోలార్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు 2024 సంవత్సరాన్ని అనూహ్య సంవత్సరంగా మార్చేశాయని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ ఇయర్ ఎండ్ నోట్ను విడుదల చేశారు. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా, రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
ఇవి ప్రపంచ స్థూల ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చి వేశాయన్నారు. ఉక్రెయిన్, గాజా, సూడన్లో నెలకొన్న యద్ధ వాతావరణం, బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో ప్రజా ఆందోళనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవిష్యత్లోనూ ఇమ్మిగ్రేషన్, టెక్నాలజీ, ప్రపంచ వాణిజ్యం వంటి అంశాల్లో సవాళ్లు ఎదురుకానున్నాయని పరోక్షంగా ట్రంప్ పాలన గురించి ప్రస్తావించారు. వయో భారంతో అక్టోబర్ 9న దూరమైన రతన్ టాటా గురించీ తన లేఖలో ప్రస్తావించారు. తనదైన వ్యక్తిత్వం, దూరదృష్టి, వ్యూహాలతో టాటా గ్రూప్ వ్యాపార నమూనాను సమూలంగా మార్చివేసిన రతన్ టాటా ఈ ఏడాదే దూరం కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు. వ్యక్తిగతంగా తాను ఓ మార్గదర్శకుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా 2024లో గ్రూప్ సాధించిన ఘనతలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.