గుంటూరు, డిసెంబర్ 26: భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ త్యాగాలు, పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులో గురువారం జరిగిన సిపిఐ శతవార్షికోత్సవ సభలో ఆయన పాల్గని మాట్లాడారు. తొలుత బిఆర్ స్టేడియం నుండి గాంధీ పార్క్ వరకు ప్రదర్శన నిర్వహించారు. నగర కార్యదర్శి కె.మల్యాద్రి అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి స్వాతంత్య సమరయోధులు అంటే గౌరవం లేదని, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను సైతం అవమానిస్తున్నారని మండిపడ్డారు.
కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ సంపదను అంబాని, అదానిలకు దోచిపెడుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశంలో సోషలిస్టు సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు సమాయత్తం కావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు నాయకులపై కుట్రలు పన్ని జైలుకు పంపినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి దేశానికి సంపూర్ణ స్వాతంత్యం కావాలని గొంతెత్తిన పార్టీ సిపిఐ అని అన్నారు. స్వాతంత్యం అనంతరం భూ పోరాటాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు చెప్పారు. నాటి పోరాటం, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. సభలో పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు.