చివరి గింజా.. కొనే వరకు అప్రమత్తంగా ఉండాలి

  • రైతులను చేయిపట్టి నడిపించాలి
  • ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవగాహన
  • నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయ శాఖల అధికారులు పనిచేయాలి
  • సవిూక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, డిసెంబర్‌ 26: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతు సేవా కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు రూ. 178.39 కోట్ల విలువైన 77,440 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 11,730 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని.. పక్రియ సజావుగా సాగుతున్నా, ఇప్పుడు చివరి మైలులో చివరి గింజ కొనుగోలు వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ.. ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకార తదితర శాఖల అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, రైతుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము, గోనె సంచుల అందుబాటు, మిల్లులకు ధాన్యం రవాణా, వర్షాల నేపథ్యంలో తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితరాలపై చర్చించారు. ఏ ఒక్క రైతుకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇకపైనా తీసుకోవాల్సిన చర్యలపై మార్గినిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు హితమే లక్ష్యంగా సమన్వయ శాఖల అధికారులు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్లక్ష్యానికి తావులేకుండా సేవలందించాలని స్పష్టం చేశారు. కోతలు చివరి దశలో ఉన్నందున ఆయా రైతులతో క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు.

పౌరసరఫరాల అధికారులు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. తేమ శాతం, మద్దతు ధర, గన్నీలు, రవాణా సౌకర్యం.. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్నంగా వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోందని.. ధాన్యం కొనుగోలు పక్రియపై సంతృప్తి విషయంలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు ప్రతి అధికారి, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న టార్పాలిన్ల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ కు సంబంధించి ఒక్క బియ్యపు గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని, పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్రస్థాయి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కస్టమ్‌ మిల్ల్‌డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కలర్‌ పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. పరీక్ష ఫలితాలను డాక్యుమెంట్‌ చేయాలని ఆదేశించారు. తహశీల్దార్లు, పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్లు మిల్లులు, పీడీఎస్‌ దుకాణాలు, ఎండీయూ వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, నివేదికలు సమర్పించాలన్నారు.

అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆహార భద్రత కల్పించడంలో అత్యంత కీలకమైన పౌర సరఫరాల వ్యవస్థలో ఏ చిన్న అవకతవకలకు ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ లక్ష్మీశ స్పష్టం చేశారు. మావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. నిధి విూనా, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, పౌర సరఫరాల మేనేజర్‌ ఎం.శ్రీనివాసు, డీఎస్‌వో ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ టెక్నికల్‌ అధికారి ఎం.స్వప్న, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్‌ ఏడీ కె.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News