2004 డిసెంబరు 26.. ప్రశాంతంగా ఉండే హిందూ మహా సముద్రంలో ప్రకృతి విపత్తు.. సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా సముద్ర జలాల కింద పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 9.1–9.3 గా నమోదైంది. భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు, బర్మా పరిధి టెక్టానిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపం ఏర్పడింది. దీని ఫలితంగా భారీ సునామి సంభవించింది.
సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచేశాయి. 14 దేశాల్లో సుమారు 2,30,000 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది.
శ్రీలంక, భారతదేశం, థాయ్ లాండ్ దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి దెబ్బతిన్నాయి. సీస్మోగ్రాఫు మీద రికార్డు అయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది. 8.3 నుంచి 10 నిమిషాల పాటు కంపించింది. భూగ్రహం మొత్తం ఒక సెంటీ మీటరు మేర వణికింది. ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో సైతం దీని ప్రభావం కనిపించింది. ఈ పెను ప్రకృతి విపత్తు సంభవించి 20 ఏళ్లు అవుతున్నా.. అది చేసిన గాయం ఆయా దేశాలకు ఇప్పటికీ మానడం లేదు.