సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకులు ఏపూరి బ్రహ్మం (68) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అయన స్వగృహం ఇల్లందులో మృతిచెందారు. మృతివార్త తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ తదితరులు ఇల్లందుకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం నియోజకవర్గ కార్యాలయం ‘విఠల్ రావు భవన్’లో ఉంచారు.
మృతదేహంపై పార్టీ జెండాను, పూలమాలను ఉంచి ఘన నివాళులర్పించిన అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గంలో బలమైన నాయకున్ని కోల్పోయామని, అయన మృతి, ప్రజా, రైతు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. బ్రహ్మం ఆశయాల సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపర్చారు.