న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బస్సు 27 మంది ప్రయాణికులతో అల్మోరా నుంచి హల్ద్వానీకి వెళ్తోంది. భీమ్తల్ నగర సమీపంలోని రాగానే బస్సు ఓ వంపు వద్ద అదుపుతప్పి 1,500 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది.
ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 24 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 15 అంబులెన్స్లు ఘటనాస్థలికి చేరుకొన్నాయి. క్షతగాత్రులను రోప్ల సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు.