ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్‌ అవమానించిందని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ ఓడిరచిందని తెలిపారు. మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌తో నెహ్రూ రాజీనామా చేయించారని పేర్కొన్నారు.

1954 నుంచి 88 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ సహా 21 మందికి కాంగ్రెస్‌ భారతరత్న ఇచ్చిందని.. కానీ అంబేడ్కర్‌ను ఎందుకు విసర్మించిందో సమాధానం చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో అంబేడ్కర్‌ ఫొటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని కిషన్‌ రెడ్డి తెలిపారు. అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు.

దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్‌పేయీ అని.. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని చెప్పారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం వాజ్‌పేయీ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News