సంధ్య థియేటర్‌పై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు

సంధ్య థియేటర్‌ ఘటనపై తప్పుడు పోస్టులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడితే.. కఠిన చర్యలు తప్పవన్నారు. తొక్కిసలాట ఘటనపై సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం.. ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్లు అర్జున్‌ రాకముందే తొక్కిసలాట జరిగిందని.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని.. అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా.. అర్జున్‌ రాకముందే తొక్కిసలాట జరిగినట్లుగా క్రియేట్‌ చేసిన కొన్ని వీడియోలను సోషల్‌ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తామని.. ఓ అమాయకురాలు మరణం, ఓ పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుగుతుందని చెప్పారు. దాన్ని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్‌ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని.. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని హైదరాబాద్‌ సిటీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టు చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News