నిజామాబాద్, డిసెంబర్ 25: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. మరోవైపు పంచాయతీ రిజర్వేషన్లు స్థానిక పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్ పదవీ కాలం ముగియగా అప్పటి నుంచి పల్లెల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో యంత్రాంగంతో పనులు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలకు రెడీ అయింది.
బీసీ రిజర్వేషన్ పెంచడానికి కులగణన చేపట్టిన బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ను అపాయింట్ చేసింది. ప్రతి పనీ పార్టీలకు తెలిసేలా పారదర్శకంగా చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే టైంకు అన్నీ సిద్ధం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇసి అందుతున్న ఆదేశాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్లో అమలు చేస్తూ రిపోర్టు పంపుతున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు.
బ్యాలెట్ పూపర్ పై సింబల్స్ మాత్రమే ఉంటాయి. వాటిపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులే తమకు కేటాయించిన గుర్తులు ప్రచారం చేసుకుంటారు. నిబంధనలను అనుసరించి ఇప్పుడు మొత్తం 30 గుర్తులతో బ్యాలెట్లు రూపొంద నున్నాయి. గత ఎలక్షన్లో బ్యాలెట్పేపర్ల కోసం ఉపయోగించిన బాక్స్ల రిపేర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జడ్పీ ఆఫీస్?లో భద్రపర్చిన పోలింగ్?బాక్స్ ల్లో అదనంగా ఉన్నవాటిని వారం కింద పొరుగు జిల్లాలకు తరలించారు.
పెంచిన 15 గ్రామ పంచాయతీలు కలిపి జిల్లాలో మొత్తం 545 పంచాయతీలు, 5,022 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లుగా 8,30,580 తేలారు. వారిలో పురుషులు 3,87,017, మహిళలు 4,43,548 ఉన్నారు. ప్రతి 600 మందికి ఒక పోలింగ్ సెంటర్ చొప్పున మొత్తం 5,053 సెంటర్లను ప్రకటించారు. ఆ లిస్టును ఎంపీడీవో, గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో అంటించారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాలు కల్పిస్తారు.