ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ ఎవరా? అనేది సీక్రెట్ అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టుకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. తన గాయం చిన్నదని, ఫిట్గా ఉన్నానని స్పష్టం చేశాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా.. రోహిత్ శర్మ మోకాలికి బంతి బలంగా తాకింది. దాంతో ఫిజయోతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ రోహిత్ ఆడుతాడా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. నాలుగో టెస్ట్ నేపథ్యంలో రోహిత్ శర్మ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన గాయానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.
తీవ్రమైన గాయం కాదని, తన మోకాలు బాగానే ఉందని చెప్పాడు. ‘నా గాయం చిన్నదే. నేను ఫిట్గానే ఉన్నాను. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఆలోచించకండి. కొన్ని విషయాలు బయటపెట్టాలి. మరికొన్ని దాచిపెట్టాలి. జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాం. టీమిండియా ఓపెనర్ ఎవరా? అనేది సీక్రెట్. విరాట్ కోహ్లీ తన ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు. యశస్వి జైస్వాల్ సహజ శైలిలో ఆడుతాడు. అతనికి స్వేచ్చగా ఆడే అవకాశం ఇవ్వాలి. అతను మా అందరి కంటే తన బ్యాటింగ్ను బాగా అర్థం చేసుకుంటాడు.’అని రోహిత్ శర్మ తెలిపాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న శుభ్మన్ గిల్కు కూడా రోహిత్ అండగా నిలిచాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్లో శుభ్మన్ గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ భారీ స్కోర్లుగా మల్చలేకపోయాడు. మా కుర్రాళ్ల ఆశావహుల్లో గిల్ ఒకడు. ప్రతీసారి భారీ స్కోర్లు చేయడం అంత సులువైన పనికాదు. గిల్ నాణ్యమైన ఆటగాడు. అతను బ్యాటింగ్ను అర్థం చేసుకుంటాడు. భారత జట్టులోకి రాకముందు అతను చాలా పరుగులు చేశాడు.’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.రిషభ్ పంత్ ఫామ్పై కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రోహిత్ శర్మ తెలిపాడు. ‘ఇటీవల రిషభ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడు. రెండు మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రానా అతనిపై ఓ నిర్ణయానికి రావడం సరికాదు.
ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. భారత ఆటగాళ్లంతా ఒకే పడవలో ఉన్నాడు. వారు చేసే పనిని క్లిష్టతరం చేయాల్సిన అవసరం లేదు. జట్టు కోసం ఏం చేయాలో వారికి బాగా తెలుసు.’అని రోహిత్ బదులిచ్చాడు.