హైదరాబాద్ (Samachara News):
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిమాయత్నగర్ పరిధిలోని హైదర్గూడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు జి.అనసూయ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి మాట్లాడుతూ — బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆందోళన కలిగించిందన్నారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఈ కేసులో మాత్రం పోలీసులు ఆలస్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. నిందితుడికి ముందుగానే సమాచారం ఇచ్చి, బాధితురాలిపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
అదేవిధంగా 17 ఏళ్ల బాలికపై హనీట్రాప్ కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని మహిళా సంఘాల నేతలు స్పష్టం చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
బండి భగీరథ్ కేసులో పోలీసులు ఆలస్యం చేయడం ద్వారా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన వారు — వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని, మైనర్ బాలికలపై జరిగే నేరాల విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని మహిళా సంఘాల ప్రతినిధులు సూచించారు.
ఈ సమావేశంలో జి.ఝాన్సీ, ఎస్.వరలక్ష్మి, స్వరూప, లక్ష్మి, జి.భారతి, హేమలత, బి.జ్యోతి తదితర మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.










