హైదరాబాద్, ఫిబ్రవరి 24: నిజాంపేట్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అనుమతులు గోరంతైతే నిర్మాణాలు కొండంత అన్న చందంలా తయారయ్యాయి. అక్రమ నిర్మాణాల వద్ద ఇస్తారాజ్యాంగ దోచుకెళ్ళ్తుండటంతో ప్రశ్నించే వాడే కరువయ్యారు. ఇక కొంత మంది బిఆర్ఎస్ లీడర్లు అక్రమ నిర్మాణాలను కాంట్రాక్టు తీసుకుని మున్సిపల్, ప్రెస్ ను మేనేజ్ చేస్తామని ఒక్కో భవనం వద్ద 5 లక్షలు వసూళ్లు చేసి వెనుకేసుకుంటున్నారు. ఎవరైనా వస్తే ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మా వెనుకే ఉన్నారని మీ భవనాలకు ఏమి కాకుండా చూస్తామని గల్లీ లీడర్లు హామీ ఇస్తున్నారు. ఇలా ఇటు లీడర్లు అటు అధికారులు కలిసి అక్రమ నిర్మాణాల వద్ద దోచుకెళ్తున్నారు.
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ వాసవి లే అవుట్ లో ప్రస్తుతం పదుల సంఖ్యల్లో అక్రమ నిర్మాణాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ప్రతి భవనానికి గ్రౌండ్ ప్లస్ 2 అనుమతులు మాత్రమే ఉన్నాయి. కానీ నిర్మించింది మాత్రం గ్రౌండ్ ప్లస్ 4 అంతస్థులు. నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న నిర్మాణాల వద్ద అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
ప్రెస్, అధికారులంటూ శ్రీకరుడి వసూళ్లు.. అక్రమ నిర్మానాల వద్ద అన్ని నేను చూసుకుంటానని కాంట్రాక్టు పొందిన గల్లీ లీడర్ శ్రీకర్ ప్రెస్, టౌన్ ప్లానింగ్ చూసుకుంటానని పెద్ద ఎత్తున వసూళ్లు చేశాడని తెలుస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మనిషినంటూ బెదిరిస్తున్నాడు. ఫలితంగా ప్రజా సేవకుడు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బద్నామ్ అవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించి ప్రజా ఆశీర్వాద్ధం పొందిన నేతైనా వివేకానంద గౌడ్ ఇలాంటి నేతలను పార్టీ నుండి తొలగించాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.