హైదరాబాద్, ఫిబ్రవరి 24: మల్కాజిగిరి నియోజకవర్గంలో అనేక కాలనీలు, బస్తీలలో నెలకొన్న తాగు, వాడుక నీరు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన, గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి జలమండలి జిఎం అశోక్ రెడ్డికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గౌతంనగర్ డివిజన్ పరిధి లోని వివిధ కాలనీలలో నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం మహేంద్ర హిల్స్ లో ఉన్న రిజర్వాయర్ నుండి నీటి సరఫరా సామర్ధ్యా న్ని పెంచి, ఎక్కువసేపు నీళ్లు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఈ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో బోర్లు పాడైపోయాయన్నారు. దీంతో వాడుక నీటి కోసం స్ధానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని మరమ్మతు చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకుని రావాలని కోరారు.
గౌతంనగర్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ పునరుద్ధరించాలని, అదే విధంగా మల్కాజిగిరి పరిధిలోని 1300 మంది కన్సుమర్ల మీటర్ కాన్ నెంబర్లు మహీంద్రా హిల్స్ సెక్షన్ కు మార్చాలని కోరారు తద్వారా మంచినీటి సరఫరా కూడా మెరుగ్గా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి సరఫరా అయ్యే నీటిని కొంత మేరకు పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయడం మానుకోవాలన్నారు. మంచినీటి సరఫరా సమయం పెంచాలని ఆయన కోరారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 బోర్లు చెడిపోయాయని వాటిని మరమత్తులు చేయించాలని సూచిం చారు.
మల్కాజిగిరి డివిజన్ కృపా ఆనంద్ అపార్ట్మెంట్స్ లో ఒక్క రూపాయి కనెక్షన్లను పునరుద్ధరించాలని రెండు పవర్ బోర్లు కూడా వేయించాలని జలమండలి యం.డి. అశోక్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. తమ వినతికి అధికారులు సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జగదీష్ గౌడ్, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.