హైదరాబాద్, ఫిబ్రవరి 15: నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళ్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్ నగర్ లో శనివారం రూ. 42.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేసారు. రూ. 22.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీవరేజీ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, హైదరాబాద్ నగరాన్ని సుందరంగా, స్వచ్ఛ, పచ్చ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ, రోడ్డు, తదితర మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. తమ అవసరాలకు అనుగుణంగా సి సి రోడ్లు, సీవరేజీ లైన్ అభివృద్ధి పనులు తమ కాలనీలో చేపట్టడం పట్ల ప్రేమ్ నగర్ వాసులు మేయర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఈఈ విజయ్ కుమార్, వాటర్ వర్క్స్ మేనేజర్ శివకుమార్, సంబంధిత శాఖల అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
