- తరలివస్తున్న వేలాదిమంది భక్తులు
- తగిన ఏర్పాటు చేసిన అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 12: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర పేరు కాంచింది. ఈ క్రమంలోనే నేటి నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం అయ్యింది. బుధవారం నుంచి 15వ తేదీ వరకు జాతర జరగనుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహా జాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరను నిర్వహిస్తారు. బుధవారం మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభించారు. ఇక గురువారం నాడు మండమెలిగే పూజలు.. శుక్రవారం నాడు భక్తుల మొక్కుల చెల్లింపు.. శనివారం నాడు చిన్నజాతర నిర్వహిస్తారు. జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జాతర నేపథ్యంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీగా తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. మినీ జాతర కోసం ప్రభుత్వం రూ.5.30 కోట్లు కేటాయించింది. నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు పలు శాఖల అధికారులు, వెయ్యి మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.