సీనియర్లకు ప్రాధాన్యం.. వీహెచ్‌కు కీలక పదవి..?

  • స్థానిక సంస్థలకు రేవంత్‌ కసరత్తు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు గౌరవం ఇస్తూనే తగిన పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అందున స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నందున సీనియర్లతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్‌ పోస్టుల పైన కాంగ్రెస్‌ అధి నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత పైన రాహుల్‌ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్‌కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వీహెచ్‌ కు కీలక పదవి ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్దం అవుతున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కటం లేదు. ఈ అంశం పైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి. దీంతో, రాహుల్‌గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్‌ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా వారికి పదవుల పైన రేవంత్‌ కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. వీహెచ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంట్‌ కు పోటీ చేయాలని భావించారు. కానీ, సామాజిక – క్షేత్ర స్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు వీహెచ్‌ కు కొత్త పదవి పైన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలి ఛైర్మన్‌ పదవి వీహెచ్‌ కు ఇవ్వటం పైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. రెండు నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుంచి వీహెచ్‌ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. గతంలోనే వీహెచ్‌ కు బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ గా నియమించాలని రేవంత్‌ భావించారు. అందుకు వీహెచ్‌ అంగీకరించలేదు. దీంతో, నిరంజన్‌ కు ఆ పదవి ఖాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్‌ గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్‌ కుమార్‌ ఉన్నారు. మండలి ఛైర్మన్‌ గా వీహెచ్‌ కు ఇవ్వాలనేది తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

శాసనమండలి ఛైర్మన్‌ పదవితో పాటుగా వీహెచ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ ఛైర్మన్‌ గా నియమించే అంశం పైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కుల గణన తరువాత కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి తొలి నుంచి అంకిత భావంతో పని చేస్తున్న బీసీ నేతలకు పదవులు ఇవ్వాలని తాజాగా ఢిల్లీ లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీహెచ్‌ తో పాటుగా పార్టీలో పలు కీలక పదవుల ను బీసీ నేతలకు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ పదవి సైతం బీసీ వర్గానికి కేటాయించిన అధినాయకత్వం.. త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్దం అవుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News