- పురాతన కట్టడాలకు ప్రమాదమంటూ వ్యాజ్యం
- 17కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 11: మెట్రో రైలు విస్తరణపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పాతబస్తీలో మెట్రో విస్తరణ వల్ల పురాతన కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. తెలంగాణ సీఎస్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు చారిత్రక కట్టడాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషన్లో పేర్కొంది.
తెలంగాణ హెరిటేజ్ యాక్ట్-2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉందని.. పాతబస్తీలో మెట్రోమార్గం సవిూపాన చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణాహవేలీ, మొఘల్పుర సమాధుల వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వివరించింది. మెట్రోరైలు నిర్మాణం వల్ల ఆ కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. మెట్రో డిజైన్ను హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాత ముందుకు వెళ్లాలని కోరింది. అప్పటి వరకు మెట్రో నిర్మాణ పనులు నిలిపివేయాలని హైకోర్టుకు ఏపీడబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి చేసింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు 17వ తేదీకి వాయిదా వేసింది.