- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
- ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 11: ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని.. గాయపడిన వ్యక్తి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పుర్లోని సిహోరా సవిూపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సిమెంట్ లోడ్తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరు యాత్రికులను స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వాహనం నంబరును గుర్తించారు. మినీ బస్సు రిజిస్టేష్రన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.