- మణిపూర్ ఘటనలపై మండిపడ్డ జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: మణిపూర్ గవర్నర్ అజరుకుమార్ భల్లా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపి జైరాం రమేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. నిర్దేశిత సమయంలో అసెంబ్లీ నిర్వహించడంలో గవర్నర్ నిర్లక్ష్యం చేశారని అన్నారు. వరుసగా రెండు శాసనసభ సమావేశాల మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదని ఆదేశించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 (1)ని మణిపూర్ గవర్నర్ ఉల్లంఘించారని జైరాం రమేష్ ఆరోపించారు. ఫిబ్రవరి 10న ప్రారంభం కావాల్సిన 12వ మణిపూర్ శాసనసభ 7వ సెషన్ను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ఆదివారం విడుదల చేసిన నోటీసు పేర్కొంది. ఈ నోటీసు గవర్నర్ వైఫల్యం కనిపిస్తుందని జైరాం రమేష్ ఎక్స్పోస్టులో మండిపడ్డారు.
మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య గడువు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) పేర్కొంది. అయితే 12వ శాసనసభ 7వ సెషన్ జరగదని గవర్నర్ ప్రకటించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సోమవారం ఉదయం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని గంటల ముందు ఆదివారం రాత్రి సిఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త సిఎం ఎవరో బిజెపికి తెలియదు. అందుకే ఈ సమావేశాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు’ అని రమేష్ అన్నారు.