- పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 11: వేసవి ప్రారంభానికి ముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భానుడు దంచి భగభగమంటున్నాడు. మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటుగా.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు నుండి 5 రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు, ఇతర జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన వేడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం ఖాయమని అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ -హైదరాబాద్) అంచనా వేసింది.
సోమవారం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని చెప్పింది. ఇంకా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. హైదరాబాద్ నగరంలో 36 డిగ్రీల సెల్సియస్ నుండి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంటున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20 వరకు కనీసం 5 రోజుల పాటు గరిష్ఠ ఉష్టోగ్రతలు ఉంటాయన్నారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వెల్లడిరచారు. కాగా, ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.