కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11: ప్రయాణికులకు సౌకర్యార్థం కుంభమేళా జరిగే ప్రదేశాలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140 ప్రత్యేకరైళ్లు నడిపామని అధికారులు ప్రకటించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా రైళ్లలో సుమారు 1.30లక్షల మంది రిజర్వేషన్‌ చేసుకున్న గయా, దానాపూర్‌, పాట్నా, ఆజంఘడ్‌, ప్రయాగరాజ్‌, రక్సాల్‌, బనారస్‌, గోమతినగర్‌(లక్నో) ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లివచ్చారని తెలిపారు. ఇవి కాకుండా ఇతర జోన్ల నుంచి మరో 39 ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ మీదుగా వెళ్లాయని పేర్కొన్నారు. కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేకరైళ్లన్నీ 149శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని వెల్లడించారు.

ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవకుండా లక్నో, ప్రయాగరాజ్‌, న్యూఢిల్లీ డివిజన్‌ కార్యాలయాల నుంచి సీనియర్‌ రైల్వే ఉన్నతాధికారులు యాత్రికుల రద్దీని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఆయా ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌జామ్‌ అవుతోందని, రైళ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయని సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారం సరికాదని సీపీఆర్‌ఓ తెలిపారు. కుంభమేళాకు ప్రయాణికులు సజావుగా వెళ్లి వస్తున్నారని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News