- కొత్త అయినా రాజకీయ అనుభవంతో కసరత్తు
- గత ప్రభుత్వ తప్పులపై కన్నేసి అడుగులు
అమరావతి, ఫిబ్రవరి 11: కొత్తగా ఎపిలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతోంది. ఆర్థికమంత్రిగా పయ్యావుల కేశవ్కు ఇది తొలి సవాల్ కానుంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకున్నా.. రాజకీయంగా సుదీర్ఘకాలం ఉన్న అనుభవం ఉంది. అప్పులకుప్పగా ఉన్న ఎపిని గట్టెక్కించడంతో పాటు, అనేక రంగాలను గాడిలో పెడుతున్న తరుణంలో బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వంకనుక ఆయన తన విశేష అనుభవంతో సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రధానంగా అభివృద్ది పక్కకు పోకుండా, సంక్షేమం జారిపోకుండా కత్తివిూద సాములా ఇప్పుడు మంత్రి కేశవ్ కసరత్తు చేస్తున్నారు. ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెట్ రీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధులను.. ప్రవేశపెట్టేబోయే పథకాలను సవిూక్షల్లో మంత్రి పయ్యావులకు ఆయా శాఖల మంత్రులు వివరించారు.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు.. పయ్యావులను కోరారు. ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధుల విడుదల చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏయే ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలోననే అంశంపై ఓ స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వం ఉంది. నీటి ప్రాజెక్టులకు రూ.32 వేల కోట్లు కేటాయించాలని జల వనరుల శాఖ ప్రతిపాదించగా.. అంత పెద్దమొత్తంలో కేటాయింపులు అసాధ్యమని.. ఈ ఏడాదికి రూ.21 వేల కోట్లతో సర్దుకోవాలని నిమ్మలకు పయ్యావుల సూచించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000 కోట్లు, గాలేరు-నగరి, హంద్రీ-నీవాకు చెరో రూ.4,500 కోట్లు, వెలిగొండకు రూ.1,800 కోట్లు ఇస్తామన్నారు. అయితే ఈ కేటాయింపులతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర చిన్న, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను ఎలా చేపడతామని నిమ్మల ప్రశ్నించారు. చాలా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవన్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు.
గతంలో ఏయే రంగాలను విస్మరించారు, ఎక్కడెక్కడ దుబారా చేశారన్నది గమనించి ముందుకు సాగేలా చర్చలు చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ బడ్జెట్లో అతిపెద్ద సవాల్గా ఉండనుంది. అలాగే వివిధ సంక్షేమ శాఖల్లో అమలు చేయాల్సిన పథకాలు వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాలి. ఆయా శాఖల మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎన్ఎండీ ఫరూక్ ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చారు. కాగా మైనింగ్ శాఖకు అవసరమైన నిధులను కేటాయించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రి పయ్యావులను కోరారు. మైనింగ్ శాఖ నుంచి ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. ప్రాధాన్యతల వారీగా బ్జడెట్ ప్రతిపాదనలు పెట్టాలని మంత్రి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాల్సి ఉంటుంది.