- వరుస ఘటనలతో పోలీసుల ప్రత్యేక చర్యలు
అమరావతి, ఫిబ్రవరి 10: తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. జగన్ నివాసం పక్కనున్న వైకాపా కార్యాలయం ఎదుట గార్డెన్లో ఈ నెల 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ వర్గాలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని పోలీసులు ఆ కార్యాలయ సిబ్బందిని కోరగా.. వారు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఆదివారం ఏర్పాటు చేయించారు. వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని మానిటర్కు అనుసంధానించారు. వైకాపా కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు.. మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి, బూడిద నమూనాలను తాజాగా సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు.