- పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా ముందుకు సాగాలి
- బంతిపై బ్యాటర్ దృష్టిలా చదువుపై శ్రద్ద పెట్టాలి
- తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచరాదు
- పరీక్షాపై చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్స్గా ప్రదర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. పరీక్షలే సర్వస్వం కాదన్నారు. మనం రోబోలం కాదని, మనషులమని, ఒక దగ్గరే గిరిగీసుకొని ఉండొద్దని సూచించారు.‘బయటినుంచి వచ్చే ఒత్తిడి విూద కాకుండా చదువువిూద దృష్టిపెట్టాలి. స్టేడియంలో వీక్షకులు కేకలేస్తూ, కేరింతలు కొడుతూ ఎంతగా శబ్దాలు చేస్తున్నా.. బ్యాటర్ దృష్టి మాత్రం బంతిపైనే ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టాలి‘ అని అన్నారు. కంటినిండా నిద్ర, సమతుల ఆహారం ముఖ్యమని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇతర పిల్లల్లాగే ఉండేలా చూడాలని, విూ పిల్లలు వారికి అత్యంత ఆసక్తి ఉన్న అంశాల గురించి చదివేలా చేయాలని మోదీ సూచించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పిల్లలతో ముచ్చటించారు. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ’పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ వీడియోను సోమవారం ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దిల్లీలోని సుందరవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎప్పుడూ ఒక పెద్ద హాల్లో పరీక్షలకు సంబంధించిన అనుమానాలు, ఒత్తిడి తట్టుకోవడం ఎలా అనే అంశాలపై సోదాహరణంగా వివరించే మోదీ.. ఈసారి విభిన్నంగా విద్యార్థులతో ముచ్చటించారు. సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు.పిల్లలు తమ ఆసక్తులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, అందరితో బహిరంగంగా మాట్లాడాలని, తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ప్రతి పిల్లలు ఏదో ఒక రంగంలో రాణిస్తారని అన్నారు.ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా వర్చువల్గా పాల్గొన్నారు. ‘ప్రతి విద్యార్థికి భిన్నమైన టాలెంట్ ఉంటుంది. కొంతమంది చదువులో ముందుంటారు.
మరికొందరికి మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. విద్య సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించినది. విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. వారు తమ అభిరుచుల వైపు మళ్లేందుకు స్వేచ్ఛ అవసరం. పరీక్షలే సర్వస్వం అనే భావనలో జీవించకూడదు. పిల్లలకు సలహాలు ఇవ్వకూడదు. వారిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గమనించాలి. వారిలో ఉన్న విశిష్టమైన ప్రతిభను వెలికితీయాలి‘ అని చిన్నారులు, టీచర్లకు మోదీ సూచించారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను ప్రధాని ఉదహరించారు. ’సచిన్కు చదువు కంటే ఆటల విూదే ఆసక్తి ఎక్కువ ఉండేది. దాన్ని గుర్తించిన అతడి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు’ అని ప్రధాని గుర్తుచేశారు. సమయపాలన అన్నింటికంటే ముఖ్యం. రేపు విూరు ఏం చేయాలని అనుకుంటున్నారో ఒక కాగితం విూద రాసుకోవాలి. ఏ పని కోసం ఎంత సమయం వెచ్చించాలో ఆలోచించుకోండి. విూకు ఇష్టమైన సబ్జెక్ట్కు ఎక్కువ సమయం, ఇష్టం లేని దానికి తక్కువ సమయం కేటాయించొద్దు. దానికి భిన్నంగా చేయండి. కష్టమైన పాఠ్యాంశాన్ని ఒక సవాలుగా స్వీకరించండి అని సలహా ఇచ్చారు.
స్నేహితుల్లో మంచి లక్షణాలు గమనించండి. దానివల్ల ప్రతి పనిలో సానుకూలతను చూసే అలవాటు పెరుగుతుంది. ఇక స్నేహితుల కష్టాలను అర్థం చేసుకునేందుకు వారితో మాట్లాడండని అన్నారు. కేరళ నుంచి వచ్చిన విద్యార్థి ఆకాంన్షా ప్రధాని మోదీని హిందీలో పలకరించారు. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన.. ఇంత చక్కగా హిందీ ఎలా నేర్చుకున్నావంటూ ప్రశ్నించారు. ‘నాకు హిందీ అంటే చాలా ఇష్టం. నేనొక కవిత కూడా రాశా‘ అంటూ దానిని చదివి వినిపించారు. అలాగే.. విూరు ప్రధాని కాకపోయి ఉంటే ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ఓ విద్యార్థి మోదీని అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. ’నైపుణ్యాభివృద్ధి శాఖ అంటే ఆసక్తి’ అని చెప్పారు. ‘నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి నేను నైపుణ్యాల విభాగాన్ని ఎంచుకుంటాను అని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నైపుణ్యాలపై దృష్టి పెట్టాలన్నారు. పిల్లలు అలసిపోతే పరీక్షల్లో బాగా రాయగలరా? అని అన్నారు.
మనం రోబోలము కాదు, మనుషులం. పిల్లలను నాలుగు గోడల మధ్య బంధించి పుస్తకాల చెరసాలలో వేస్తే, వారు ఎప్పటికీ ఎదగలేరు అని ప్రధానమంత్రి అన్నారు. వారికి బహిరంగ ఆకాశం కల్పించాలని, స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని అన్నారు. పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను విముక్తి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపించడమే ప్రధాన ఉద్దేశం.