- సుమారుగా 30 షాపులు దగ్ధం
- 20 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పించిన సిబ్బంది
హైదరాబాద్, ఫిబ్రవరి 10: అగ్ని ప్రమాదాలతో నగరవాసులను కంటిమీద కునుకు లేకుండాపోతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాతబస్తీ చార్మినార్ సమీపంలో దివాన్దేవిడిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వరుసగా ఉన్న పలు షాపులకు మంటలు వ్యాపించి ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. సుమారు 30కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నాయి.
20 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. రంజాన్ పండుగా దగ్గర పడుతుండడంతో బట్టల షాపు యజమానులు కొత్త స్టాకును తెచ్చిపెట్టారు. అగ్ని ప్రమాదంలో భారీగా నష్టం జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆస్థి నష్టం భారీగానే జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదము జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.