హైదరాబాద్, ఫిబ్రవరి 8: నిండు అసెంబ్లీలో కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణగ తొక్కుతా అని అవమానిస్తే, 40 నిమిషాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ పేరు తీయకుండా అవమానించారన్నారని, ఎన్నో ఏళ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్ర మోదీ గుర్తించి గుండెలకు హత్తుకుని హృదయంలో పెట్టుకున్నారన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2025 డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తన 30 ఏళ్ల పోరాటంలో ప్రతి చోటా తనతో పాటే నడిచిందన్నారు.
తన 30 ఏళ్ల పోరాటంలో జాతి కోసం కొన్ని రోజులు కష్టపడితే సమాజంలో జరిగే అనేక కష్టనష్టాలపై పోరాటం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్కు ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తమ ఉద్యమాన్ని గుర్తించి గుండెలకు హత్తుకున్న నరేంద్ర మోదీని, ఉద్యమానికి అడుగడుగున బాసటగా నిలిచిన సమాజానికి తాను రుణపడి ఉంటానని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బి.వెంకటేష్ నేత, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, వివిధ సంఘాల నాయకులు సాయి కృష్ణ, సుధాకర్ గండే, పిట్ట శ్రీనివాస్ రెడ్డి,పెద్దాపురం నరసింహ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, దాసన్న తదితరులు పాల్గొన్నారు.