రిజల్ట్‌ చూసైనా కాంగ్రెస్‌ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8: ఢిల్లీ ఎన్నికలు చూసైనా కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు తెలిపారు. ఏబీఎన్‌తో రఘునందన్‌ రావు మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ము ఉంటే 76 అసెంబ్లీ 12 పార్లమెంట్‌ల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని అన్నారు. ఢిల్లీ ఎన్నికలకు కేటీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేటీఆర్‌కు కాంగ్రెస్‌ మీద అంత ప్రేముంటే బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో మెర్జ్‌ చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీజేపీ సత్తా ఏంటో తెలుస్తోందని అన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే మొహం లేని వాళ్లు మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కేటీఆర్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్‌ అని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీకి గాడిదగుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు. లోకల్‌ బాడి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఢిల్లీ ఫలితాలే పునరావృతం అవుతాయని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు పేర్కొన్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ తెలిపారు. 27 ఏళ్ల తర్వాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలిందని అన్నారు. మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారని ఉద్ఘాటించారు. తాను ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. దేశ రాజధానిలో మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను ఉండొచ్చని.. అది హై కమండ్‌ నిర్ణయమని చెప్పారు. రేవంత్‌ రెడ్డికి లోకల్‌ బాడి ఎన్నికల భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు అంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం ఎదురు అవుతోందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News