ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు కొట్టారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్‌, రేవంత్‌ రెడ్డి పాత్ర అమోఘమని సెటైర్లు గుప్పించారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన కాంగ్రెస్‌కు ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని ఆక్షేపించారు. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన ఆ పార్టీకి బెడిసికొట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్లీ నిర్వహించాలని సూచించారు.

అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసిన తర్వాత అప్పుడు ఇతర రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేసుకోవాలని హితవు పలికారు. లేదంటే రేవంత్‌ ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీష్‌రావు హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News