రాజకీయాల్లో అవినీతిని ఊడ్చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ..రాజకీయంగా అందలం ఎక్కి..అవినీతిని కేరాఫ్ అడ్రస్గా మార్చుకున్న ఆప్ పార్టీని ఢిల్లీ ప్రజలే ఊడ్చి పడేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన కేజ్రీవాల్ కేవలం ప్రధాని పీఠంపై కన్నేసి ఎప్పుడైతే రాజకీయాలు మొదలు పెట్టారో అప్పుడే ఆయన పతనం ప్రారంభం అయ్యిందని చెప్పాలి. అవినీతి వ్యతిరేక రాజకీయాలు కొనసాగించివుంటు కేజ్రీవాల్ రాజకీయాల్లో వజ్రంలా నిలిచేవారు. దేశ ప్రధాని పదవి కోరుకోకుండానే వచ్చేది. రాజకీయాలకు చుక్కానిగా ఉండేవారు. కానీ ఆయన ఢిల్లీలో పాగా వేయడంతోనే ఇక తనకు ఎదురులేదన్న రీతిలో అవినీతి పంకిలంలో కూరుకు పోయారు. ఆయన మంత్రులు, అనుచరులు, ఎమ్మెల్యేలు అంతా అందులో దిగబడ్డారు. యధారాజా తథా ప్రజా.. అన్న సామెతలాగా ఆయనలాగే ఆయన అనుచరగణం రాజకీయాలు నడిపింది. అవినీతి అన్నది అగ్నికణం లాంటిది. దానిని పట్టుకుని సాగాలంటే ధైర్యం కావాలి. కానీ కేజ్రీవాల్ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అందుకే పదేళ్లుగా అందలమెక్కించిన ఢిల్లీ ప్రజలు విసుగుచెంది ఊడ్చేశారు.
అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చేరిన కేజ్రీవాల్ ఓటమిని ఇప్పుడు హజారేనే అభినందించే పరిస్థితి వచ్చింది. అవినీతికి దూరంగా ఉండాలని ఆయన పదేపదే హెచ్చరించినా కేజ్రీవాల్ పెడచెవిన పెట్టారు. అవినీతి వ్యతిరేక రాజకీయాలకు తానొక బ్రాండ్ అని ప్రచారం చేసుకున్న కేజ్రీవాల్ దానికి కట్టుబడి ఉండలేదు. అనేక అవినీతి కేసుల్లో తానూ, తన అనుయాయులు ఇక్కుకుని విలవిల్లాడుతూ.. కేవలంమోడీని చూపి రాజకీయం చేశారు. అరవింద్ కేజ్రీవాల్..అవినీతి మరకలతో ఇప్పుడు మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుని పట్టుతప్పారు. అవినీతి చుట్టూ కేజ్రీవాల్ అల్లుకు పోయారని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు ఊడ్చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జన లోక్పాల్ బిల్లుకోసం అన్నాహజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు సంచలనంగా మారిన ఆప్ ఇప్పుడు అడ్రస్ గల్లంతయ్యిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో బిజెపి బాగా కష్టపడి పనిచేసిందనే కన్నా, ఆప్ తన సైద్దాంతికత నుంచి తప్పుకోవడమే ఓటమికి కారనమని చెప్పుకోవాలి.
ప్రజలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, ఉచిత విద్య లాంటి నినాదాలతో మార్మోగించిన కేజ్రీవాల్ అసలు సమస్యలు పక్కన పెట్టారు. ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంచినీటి సరఫరాకు కారణమైన యమునా నది కాలుష్యం గురించి మాట్లాడలేదు. మోడీని, బిజెపిని విమర్శించడమే రాజకీయంగా ముందుకు సాగారు. అందుకే పదేళ్లుగా అధికారంలో ఉన్నా..లాభం లేకుండా పోయిందని ప్రజలు ఆలోచించారు. చివరకు కేజ్రీవాల్ను కూడా ఓడిరచేలా చేశారు. సిఎం అతిశీని కూడా ఓడిరచారు. రాజకీయాల్లో హీరియిజం ఉండాలి. శత్రువును ఎదుర్కొనే ధైర్యం ప్రదర్శించాలి. కానీ అలాంటివేవీ కేజ్రీవాల్ చేయలేదు. రాజకీయాల్లో అవినీతి అంతం ఆవాలంటే ఆప్ రావాలన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆప్ అనతి కాలంలోనే అవినీతి పార్టీగా ముద్ర వేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలో ఓటమి అన్నది కేజ్రీవాల్ స్వయంకృతం. నిజాయితీగా ఢిల్లీలో పాలన చేసివుంటే ఆయన ప్రతిభ ఇనుమడించేది. ప్రజలు ఆదరించేవారు.
కానీ అది వదిలిపెట్టి దేశమంతా తిరిగి, తానే ప్రధాని కావాలన్న దురాలోచనలో రాజకీయాలు చేసి చతికిలపడ్డ తీరు..భారత రాజకీయాల్లో ఓ గుణపాఠం లాంటివి. అవినీతిపై పోరాటంలో కాంగ్రెస్పై యుద్దం ప్రకటించిన కేజ్రీవాల్..అనతి కాలంలోనే దేశ ప్రజల మనసులు గెల్చుకున్నారు. ప్రజలు రాజకీయ నాయకుల అవినీతి పట్ల ఎంత అసహ్యంగా ఉన్నారనడానికి కేజ్రీవాల్ ఎదుగుదలే కారణం. కానీ అనతి కాలంలోనే కేజ్రీవాల్ నిజస్వరూపం బయటపడింది. ఆయన ముసుగు తొలగింది. అవినీతికి కేంద్రంగా కేజ్రీవాల్ రాజకీయాలు
నడిచాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇందుకు పరాకాష్ట. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలసి అవినీతి స్కామ్లో ఇరుక్కోవడం ఆయన పతనానికి నాంది పలికింది. అలాగే తన ఇంటిని వందల కోట్లతో అద్బుతంగా శీష్మహల్గా మార్చుకున్న తీరు ఆయన ప్రతిష్టను దిగజార్చింది. కాంగ్రెస్ అవినీతిని వ్యతిరేకించిన కేజ్రీవాల్… కాంగ్రెస్ పంచనే చేరారు. ఇవన్నీ గమనిస్తూ వచ్చిన ప్రజలు రాజకీయాల్లో అబద్దాలుచెప్పే వ్యక్తిగా గుర్తించారు. అబద్దాలుచెప్పేవారిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ నిజాయితీగా ఉంటానంటూ అబద్దాలుచెబితే మాత్రం సహించరు.
నిప్పులేనిదే పొగరాదన్నట్లు.. కేంద్రం ఎంతగా కక్షకట్టి కేసులు పెట్టినా.. అవినీతి లేనిదే కేసులు చుట్టుకోవు. మోడీని నిందించినంత మాత్రాన తన అవినీతిని కప్పిపుచ్చు కోలేరు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కూడా గుణపాఠం లాంటివే. తన రాజకీయ ధోరణిని కాంగ్రెస్ మార్చుకోవాల్సి ఉంది. కుటుంబ రాజకీయాలు చేసినా, ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఎంతగా ఇప్పుడు అరిచి గీపెట్టినా ప్రజలు ఇకముందు నమ్ముతారని అనుకోవడానికి లేదు. గెలుపు కోసం అవినీతి వ్యతిరేక పోరాటాన్ని పక్కన పెట్టిన కేజ్రీవాల్, ఉచిత పథకాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నంలో రాజకీయాలు మొదలు పెట్టారు. అవినీతి వ్యతిరేక రాజకీయాలు పక్కన పోయాయి. కేవలం తన స్వార్థ రాజకీయాలతో దేశ ప్రధాని కావడమే లక్ష్యమన్న రీతిలో ముందుకు సాగారు. పరమపద సోపాన పటంలో పెద్దపాము మింగితే పడ్డట్లుగా కిందపడ్డారు.
ఇప్పుడు ఆయన అవినీతి వ్యతిరేక మాటలు చెబితే ఇక ప్రజలు నమ్మరు. ఏం చెబితే , ఏం చేస్తే రాకీయంగా ఎదుగగలమో కొత్తగా ఆలోచించాలి. అవినీతికి సంబంధించి మాట్లాడితే ప్రజలు ఛీత్కరించే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ పతనం కూడా ఓ రాజకీయ గుణపాఠంగా చూడాలి.