మంగళగిరి ఎయిమ్స్‌కు పూర్తి సౌకర్యాలు

  • మంత్రిని కలిసిన మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌

అమరావతి, ఫిబ్రవరి 7: ప్రతిష్టాత్మక మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలందిస్తుందని తనను కలిసిన నూతన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఆచార్య అహంతేమ్‌ శాంతాసింగ్‌ కు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ హావిూ ఇచ్చారు. శుక్రవారంనాడు వెలగపూడి ఎపి సచివాలయంలో మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భౌగోళికంగా మంగళగిరిలోని సుందరమైన, ఆహ్లాదభరిత మైన కొండల నడుమ ఎయిమ్స్‌ను కేందప్రభుత్వం నెలకొల్పిందన్నారు. 2018లో ప్రారంభమైన దీనికి గత ప్రభుత్వ హయాంలో మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరించిందని, అలాగే ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరాను కూడా కల్పించిందని అన్నారు.

183 ఎకరాల్లో ఏర్పాటైన ఎయిమ్స్‌ లో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు స్థలం లేనందున, కొలనుకొండలో 10 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆదేశాలిచ్చారన్నారు. త్వరితగతిన ట్రామాకేర్‌ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే 965 పడకల ఆసుపత్రిగా మంజూరైన ఎయిమ్స్‌ లో ప్రస్తుతం 650 పడకలున్నాయని, విస్తరణకు తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ శాంతాసింగ్‌కు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్‌ అభివృద్ధికి భవిష్యత్తులో అన్ని విధాలా సహకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News