హైదరాబాద్, ఫిబ్రవరి 6: దశాబ్దాల పోరాటం అనంతరం దక్కిన వర్గీకరణ ఫలాలను మందకృష్ణ మాదిగ బేషజాలకు పోయి వ్యతిరేకించవద్దని మాదిగ హక్కుల దండోరా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ పేరు మాండ్ల రామకృష్ణలు మాట్లాడారు.. ఎస్సీ వర్గీకరణ నివేదికను అసెంబ్లీలో ఆమోదం పొందేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి లకు తమ దండోరా తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, వివిధ పార్టీల నేతలకు అభినందనలు తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అగ్రకులాలకు ఇస్తే స్పందించని మందకృష్ణ మాదిగలకు ఇచ్చిన 9 శాతం పై స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. మందకృష్ణ లక్ష డప్పులు, వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్రంలో చేపట్టాలని హితోపదేశం చేశారు. మాల, మాదిగ నేతలంతా రిజర్వేషన్లు పెంచేందుకు ఏకమై పోరాటాలు చేయాలని వారు కోరారు.. ఈ సమావేశంలో బుగ్గ మైసయ్య మాదిగ, అందేలా భవాని రెడ్డి ,మేతరి రోజా రమణి, కుడిళ్ళ ప్రవీణ్ మాదిగ, డప్పు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.