- మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ విక్రయం చాప కింద నీరులా విస్తరిస్తోంది. పోలీసులు సైతం ముమ్మర తనిఖీలు నిర్వహించానా.. ఈ డ్రగ్స్ విక్రయం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం సైతం డ్రగ్స్ అంశంలో కఠిన వైఖరి అవలంబిస్తోంది. కానీ డ్రగ్స్ విక్రయాలు మాత్రం ఆగడం లేదు. మాదాపూర్లో సాప్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు డ్రగ్ విక్రయిస్తున్న ఒలివర్ అలియాస్ జాన్సన్ను అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బుధవారం హైదరాబాద్లో వెల్లడించిన విషయం విదితమే.
హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేయడానికి డ్రగ్ పెడర్లు వచ్చినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో లంగర్ హౌస్ పోలీసులతో కలిసి నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారన్నారు. దీంతో డ్రగ్స్ కేసులో ఆఫ్రికాకి చెందిన ముగ్గురు డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. 2009లో జాన్సన్ అలియాస్ జాన్.. బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడని.. అతడి వీసా గడువు 2013లో ముగిసిందని తెలిపారు. ఇండియా వచ్చిన అనంతరం అతడు డ్రగ్స్ సరఫరా చేస్తూ వస్తున్నాడని పేర్కొన్నారు. ఢిల్లీ నుండి బెంగళూరుకు బల్క్లో డ్రగ్స్ సప్లై చేసేవాడని చెప్పారు. నైజీరియన్స్తో పరిచయం చేసుకొని హైదరాబాద్, బెంగళూరుకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని వివరించారు.
వారి వద్ద నుంచి 1300 గ్రాముల ఎండీఎంఏ, రూ. 1.60 కోట్లు డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. అలాగే నిందితుడు ఒలివర్ అలియాస్ జాన్సన్ను కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రోమియో అనే పాత నేరస్తుడిని సైతం అరెస్ట్ చేశామన్నారు. వీసా గడువు ముగిసిన సెల్ వేస్టార్.. హైదరాబాద్లోనే ఉంటున్నారని డీసీపీ సుధీంద్ర వివరించారు.