- కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి
- లిక్కర్ కేసులో మిథున్రెడ్డికి ఏం సంబంధం
- విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అమరావతి, ఫిబ్రవరి 6: కష్టాలు అందరికీ వస్తాయి, కానీ కష్టాలు తట్టుకుంటేనే ఇంకా రెట్టింపు మంచి రోజులు వస్తాయని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటం సహా.. పార్టీ నేతలు, కార్యకర్తలపై నమోదవుతున్న కేసులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. తమ పార్టీ నేతలపై చంద్రబాబు సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. అంతేకాదు.. లిక్కర్ విషయంలో మిథున్ రెడ్డి పేరును తీసుకురావడంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకు మద్యానికి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు.
ఎవరో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం ద్వారా వైసీపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు.. మద్యం రేట్లు మేము పెంచామా.. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించినందుకు నాకు లంచాలు ఇస్తారా.. రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మామూళ్లు ఇస్తారా.. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నారు.. నాకు డబ్బుపై వ్యామోహం లేదు.. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాం.’ అని వైఎస్ జగన్ తాను చేసిన పనులను చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వైసీపీని వీడుతున్న రాజ్యసభ సభ్యుల అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ముఖ్యంగా.. విజయసాయి రెడ్డి అంశాన్ని పేర్కొన్నారు. ‘వైసీపీ నుంచి బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి.
ప్రలోభాలకు లొంగో.. భయపడో లేక రాజీపడో అటు పోతే.. విశ్వసనీయత సంగతేంటి.. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైమ్ వస్తుంది. విశ్వసనీయత ముఖ్యం. ఇది విజయసాయిరెడ్డికైనా మిగతా వారికైనా వర్తిస్తుంది.’ అని జగన్ అన్నారు. ఇక అసెంబ్లీకి రావడంపైనా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వస్తే తమకు మాట్లాడే సమయం ఇస్తారా? అని జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎంకు ఎంత సమయం ఇస్తారో తమకూ అంతే సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత జగన్ అసెంబ్లీ ముఖం చేసింది లేదు.
వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందడం.. అసెంబ్లీలో అధికారపక్షాన్ని ఎదుర్కోలేమోననే భయంతో.. జగన్ అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామంటూ మెలిక పెట్టి కూర్చున్నారు జగన్. వాస్తవానికి ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల లెక్క ప్రచారం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదు. అయినప్పటికీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరడం.. రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.