హైదరాబాద్, ఫిబ్రవరి 6: నగరంలో భూములకు బాగా డిమాండ్ ఉండటంతో ఖాళీ స్థలం కనిపిస్తే చాలా కబ్జాదారులు అక్కడ వాలిపోయి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రభుత్వ సూచిక బోర్డు ఉన్నా దానిని తొలగించి ఆ స్థలంలో షెడ్లు, టెంట్లు వేసి ప్రైవేట్ సైన్యాన్ని కాపలాపెట్టారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 తట్టిఖానాలో జలమండలి కార్యాలయం పక్కనే ప్రభుత్వానికి చెందిన మూడెకరాల స్థలం ఉంది. గత ఏడాది డిసెంబర్లో కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంది.
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొన్నిరోజులు స్తబ్దుగా ఉన్న కబ్జాదారులు మళ్లీ స్థలంలో షెడ్లు, రెండు టెంట్లు వేసి ప్రైవేటు సైన్యాన్ని కాపలాగా పెట్టారు. ప్రభుత్వ సూచిక బోర్డులను తొలగించారు. సమాచారం అందుకున్న షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి సిబ్బందితో వెళ్లి షెడ్లను, టెంట్లను తొలగించి ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు.