హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి ద్వారా అర్హులైన వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సివిల్ సప్లై అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని అమీర్ పేటలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. కుల గణన సమయంలో రేషన్ కార్డు రానివారు నిరాశ పడాల్సిన పనిలేదన్నారు. దిగువ మధ్య తరగతి వర్గం వారికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అయితే అర్హులైన ఇతరులు ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన వారికి తప్పకుండా రేషన్ కార్డు అందుతుందని హామీనిచ్చారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నీలిమ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.