- స్పత వాహనసేవల్లో అనుగ్రహించిన శ్రీవారు
తిరుమల, ఫిబ్రవరి 4: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. దేవ దేవుడిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వామన సేవల్లో పాల్గొన్నారు. మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. రథసప్తమి సందర్భంగా శ్రీనివాసుడు సప్తవాహనాల్లో భక్తులను అనుగ్రహించారు. సూర్యజయంతి సందర్భంగా సూర్యప్రభ వాహనంతో మొదలై చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చందప్రభ వాహనాలపై ఒకేరోజు స్వామివారు అనుగ్రహించారు. అందుకే ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరింపచేశాడు. ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత.
ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యప్రభ వాహనంలో ఉండే స్వామిని దర్శించుకుంటే సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. సూర్యప్రభ వాహనం తర్వాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనంపై శ్రీవారి చిద్విలాసాన్ని చూసి తరించారు భక్తులు. చిన్న శేషుడిని నాగలోకానికి రాజుగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయం అనుసరించి భగవంతుడు శేషి..ఈ ప్రపంచం శేషభూతం అని అర్థం. చిన్నశేష వాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే కుటుంబ శ్రేయస్సు ఉంటుందని భక్తుల విశ్వాసం రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ, చిన్న శేష వాహనం తర్వాత గరుడ వాహనంపై దర్శన మిచ్చారు మలయప్ప స్వామివారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. జ్ఞానవైరాగ్యానికి రూపం అయిన రెక్కలతో విహరించే గరుడుడిపై కొలువైన మలయప్పస్వామిని దర్శించుకుంటే సకలపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో వాహనసేవ హనుమంత వాహనం.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకూ మలయప్పస్వామి హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరించారు. భక్తులలో అగ్రగణ్యుడు అయిన ఆంజనేయుడు చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధి. హనుమంత వాహనంపై విహరించే మలయప్పస్వామి దర్శనం సకల భయాలను రూపుమాపి, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది.శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ వాహన సేవల్లో ఇక్ష జె శ్యామల రావు, అదనపు ఇక్ష సిహెచ్ వెంకయ్య చౌదరి, ఏఇక్ష శ్రీ వి వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, నన్నపనేని సదాశివరావు, జి.భానుప్రకాష్ రెడ్డి, ఇంఛార్జి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.