- సుందరంగా తిరుమల ఆలయం
- స్వామి దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు
తిరుమల, ఫిబ్రవరి 3: రథసప్తమి వేడుకలకు తిరుమల సుందరంగా ముస్తాబైంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాడ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మాడ వీధుల్లో ఏర్పాట్లను సోమవారం తితిదే ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు తదితరులు పరిశీలించారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం ఈవో శ్యామలరావు విూడియాతో మాట్లాడుతూ.. రథసప్తమికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.
2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఎండ వేడి తగలకుండా షెడ్లు ఏర్పాటు చేశామని, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. మంగళవారం రాత్రి చందప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచనున్నట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి రెండు రెట్లు అధిక భద్రత కల్పిస్తున్నట్టు వివరించారు.