ఉప ఎన్నికలకు సిద్దం కండి.. కెటిఆర్‌ పిలుపు

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు
  • సుప్రీం గత తీర్పులే ఇందుకు నిదర్శనం
  • పార్టీ నేతలకు ఎక్స్‌ వేదికగా కెటిఆర్‌ పిలుపు
  • కెటిఆర్‌ పిటిషన్‌ను 10వతేదీకి వాయిదా వేసిన సుప్రీం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3: బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈరోజు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు. అలాగే, ఫిరాయింపు దారులను కాంగ్రెస్‌ పార్టీ కాపాడడం అసాధ్యమన్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే వ్యవహారంలో కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ విచారణ సోమవారం నాటికి వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌లతో కలిపి విచారిస్తామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడిరచింది. ఇక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాలయాపన చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేటీఆర్‌ జనవరి 29న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. స్పీకర్‌ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

అలాగే, ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి ఈ నెల 10వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వారిపై వేటు పడటం ఖాయమని, ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విూద గెలిచిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్‌ గౌడ్‌ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌ రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీలో చేరారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్‌ఎస్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం జతచేసింది. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను.. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. పాత పిటిషన్‌తో కలిపి కేటీఆర్‌ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై రెండు రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరుగగా.. సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్‌ ఆలస్యం చేయడాన్ని తప్పుపట్టింది.

ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి విూ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకనా అని ప్రశ్నించింది. స్పీకర్‌కు ఎంత సమయం కావాలో విూరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News