జాతుల మధ్య ఘర్షణను రేపేలా సిఎం ఆడియో

  • ఫోరెన్సిక్‌ విచారణకు ఆదేశించిన సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ రగిలిపోతోంది. హింసను ప్రేరేపించడం వెనక ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆడియోలు కూడా లీక్‌ అయ్యాయి. ఈ ఆడియో క్లిప్‌కు సంబంధించి ప్రభుత్వ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌కు సంబంధించి కొన్ని ఆడియోలు లీక్‌ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ.. కుకీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్టు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్‌లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అయిన ’ట్రూత్‌ ల్యాబ్స్‌’ పరిశీలించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. అందులోని వాయిస్‌.. సీఎం గొంతుతో 93 శాతం మ్యాచ్‌ అయినట్లు తేల్చిందన్నారు.

వాదనలు విన్న అనంతరం.. ఈ ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను అందించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఫోరెన్సిక్‌ లాబొరేటరీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. కాగా.. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరకాలంగా మణిపుర్‌ అట్టుడుకుతోంది. హింస కారణంగా ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను నిలువరించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హింసను ప్రేరేపించారంటూ సీఎం బీరేన్‌సింగ్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News