యమునా కాలుష్యం నివారణపై కానరాని చిత్తశుద్ది !

ఢిల్లీ ఎన్నికల పుణ్యమా అని..యమునా కాలుష్యంపై మరోమారు పతాక శీర్షికలో వార్తలు చెలరేగాయి. ఈ విషయంలో ఇంతకాలం అటు ఢిల్లీ ప్రభుత్వం కానీ, ఇటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కానీ పట్టించు కోవడం లేదు. గంగా కాలుష్యం గురించి పదేళ్లుగా వల్లెవేస్తున్న మోడీ దానిని పునరుజ్జీవింపచేసే ప్రయత్నాలు పెద్దగా చేయడం లేదు. యమునా కాలుష్యానికి కారణం ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం తప్ప మరోటి కాదు. కాలుష్యాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తామని ఇరు పార్టీలు ఎక్కడా ప్రకటించలేదు. ప్రజలపై చిత్తశుద్ది లేదనడానికి వీరి ప్రచార తీరే నిదర్శనం. ప్రధానంగా బిజెపి గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఆప్‌ కూడా పదేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉంది. అయినా ఈ సమస్యను పదేళ్లలో గుర్తించి చర్యలకు ఉపక్రమించలేదు. ఎక్కడా వీరికి చిత్తశుద్ది కానరాలేదు. నీటి కాలులష్యాన్ని రాజకీయ కోణంలో చూపించి, లబ్ది పొందాలన్న దుగ్ధ రెండు పార్టీలది. వీరికి చిత్తశుద్ది లేదని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ క్రమంలో బిజెపిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా యమునా కాలుష్యంపై దుమారం రేపారు. అయితే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బిజెపి సహజంగానే ఎదురుదాడికి దిగింది. కేజ్రీవాల్‌ తీరును తప్పు పట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసే ప్రయత్నంలో ఉన్న బిజెపి ఆప్‌ ను దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ మారేలా చేస్తున్నారు. అలాగే యమున విషయంలో కూడా సానుకూలంగా స్పందించి కాలుష్యరహిత యమునను చేద్దామన్న సంకల్పం ప్రకటించలేదు. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ, బిజెపి, కాంగ్రెస్‌ పోటీపడుతున్నాయి. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈసారి గెలిచే అవకాశం లేకుండా బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది.ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా, జెపి నడ్డాలు ప్రచారంలో దూకుడు పెంచారు. కేజీవ్రాల్‌పై విమర్శలు గుప్పించడంలో భాగంగా యమునా కాలుష్యంపై ఎదురుదాడికి తెగించారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈసారి తమదే విజయమని ఢంకా బజాయిస్తున్నారు.

మరోవైపు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి నడ్డా, యపి సిఎం యోగి ఆదిత్యానాథ్‌ తదితరులు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు.ఈ తరుణంలో యమునా నదిపై రగడ ఆమ్‌ఆద్మీ, బిజెపి పార్టీల మధ్య వ్యవహారం రచ్చగా మారింది. యమునానది కాలుష్యం కావడానికి హర్యానా ప్రభుత్వమే కారణమని కేజీవ్రాల్‌ ఆరోపించడం రాజకీయ దుమారం రేపింది. యమునను విషతుల్యం చేశారని ఆరోపించారు. తాను బతికి ఉన్నంతవరకు యమునా నది నీటిని ఢిల్లీ ప్రజలు తాగకుండా చేస్తానని కూడా కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రధాని తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా అంటూ కేజ్రీవాల్‌ తీరుపై ప్రధాని మోడీ మండిపడ్డారు. మొత్తంగా ఇదో ఎన్నికల ప్రచారాశంగా మారింది. అంతేగానీ యమునా కాలుష్య నివారణకు సవాళ్లుగా మారివుంటే బాగుండేది. కానీ అలా చేసే దమ్ము,ధైర్యం వీరికి లేదు. అయితే యమున కాలుష్యంపై వచ్చి లేదా చేసిన ఆరోపణలపై మాత్రం హర్యానా ప్రభుత్వంతోపాటు కేంద్రఎన్నికల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.

ఇది రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడమవుతుందని, ఢిల్లీ జల్‌బోర్డు ఉద్యోగులు విషాన్ని ఎలా గుర్తిస్తున్నారో చెప్పాలని ఎన్నికల కమిషనర్‌ కోరారు. ఈ మేరకు కేజీవ్రాల్‌కు నోటీసులు పంపారు. యమునా నదిలో అమోనియా కలియడంవల్ల విషపూరితం కాకుండా నివారించ వలసిన బాధ్యత ఢిల్లీ ఆప్‌ ప్రభుత్వానిదేనని ఎన్నికల కమిషనర్‌ గుర్తుచేశారు. మరోవైపు హర్యానా సిఎం నయాబ్‌సింగ్‌ సైనీ యమునా నదిని తాగడం వైరల్‌ అయింది. ఆయన నీటిని తాగినట్టు నటించారే తప్ప అసలు తాగలేదని, నోట్లోని నీటిని వెంటనే ఉమ్మేశారని కేజీవ్రాల్‌ ఆరోపించారు. హర్యానా సిఎం నయాబ్‌ సింగ్‌ సైనీ యమునా నీటిని తాగి ఊసేసిన వీడియో క్లిప్‌ను కేజీవ్రాల్‌ పోస్టు చేశారు. అమోనియో కాలుష్యం కారణంగా యమునా నీరు ఢిల్లీ ప్రజలకు ప్రాణాంతకంగా మారిందన్న తనపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని కేజీవ్రాల్‌ ధ్వజమెత్తారు. మొత్తంగా యమునానది కాలుష్య కాసారాంగా మారిందన్నది నిజం.

అది తాగడానికి పనికి రానంతంగా తయారయ్యిందన్నది కూడా నిజం, ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు చేతగానితనాన్ని బయటపెట్టుకున్నాయి. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా, ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేయాలి. సమస్య ఉత్పన్నం అయితే స్పందించి, పరిష్కార మార్గం చూపాలి. కానీ అలా జరగడం లేదన్నదే బాధ. తాగునీటి సమస్యను పరస్పరం భూతద్దంలో చూపించి ఓట్లవేట సాగించడం దుష్టరాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న యమునా నది రగడ కూడా అంతే. ఎన్నికలు వచ్చేవరకు యమునా నది సమస్య ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదు. సమస్య ఉందని తెలిసి కూడా పట్టించుకోలేదు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేజీవ్రాల్‌ యమునా నదిని ప్రక్షాళనం చేస్తామని ఓటర్లకు హావిూ ఇచ్చారు. ఆ తరువాత ఈ సమస్యను విస్మరించారు.

ఢిల్లీ ఒక్కటే కాదు.. ప్రధాన నదులు కాలుష్యకాసారాలుగా మారాయి. అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలపై చిత్తశుద్ది లేని ఈ పార్టీలకు గట్టిగా బద్ది చెప్పాల్సి ఉంది. నదుల కాలుష్యానికి తీసుకుంటున్నచర్యలను కేంద్రం వివరించాలి. ఏ మేరకు ఎలాంటి ప్రయత్నాలు చేశారో చెప్పాలి. ఎంతకాలంలో నదుల కాలుష్యాన్ని అరికట్టగలరో ప్రజలకు హావిూ ఇవ్వాలి. అప్పుడే ప్రజలు నమ్మతారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News