- బీహార్ ఎన్నికల కోసం మాత్రమే తాయిలాలు
- ఎక్స్ వేదికగా జైరామ్ రమేశ్ విమర్శలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించింది. ’బడ్జెట్’ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. దీంతో ఇది కాస్త పట్టాలు తప్పిందని పేర్కొంది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బిహార్లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది‘ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ’ఎక్స్’ వేదికగా ఆరోపించారు. మన్మోహన్సింగ్ హయాంలో అంతర్జాతీయ కంపెనీలు కోరుకున్న 2010 నాటి న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ను నాడు అరుణ్ జైట్లీ సూచనల మేరకు భాజపా దెబ్బతీసిందని మరో పోస్టులో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బుజ్జగించేందుకు.. తాజాగా ఆర్థిక మంత్రి చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించారని ఆరోపించారు. బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ కూడా స్పందించారు. బడ్జెట్లో ఏ మాత్రం పస లేదని విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశం ఏమున్నదని ప్రశ్నించారు. అదేవిధంగా మహా కుంభమేళాలో తొక్కిసలాటపై తాము పార్లమెంట్లో చర్చను కోరుకుంటున్నామని గౌరవ్ గొగోయ్ చెప్పారు. మహాకుంభమేళా తొక్కిసలాటపై చర్చకు డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు అందరం వాకౌట్ చేశామని, అయినప్పటికీ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా..? అనే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. సభలో చర్చ ద్వారానే ఏ విషయంలోనైనా నిజానిజాలు బయటికి వస్తాయని గొగోయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.