- రానున్న రోజుల్లో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతా
సిద్దిపేట, ఫిబ్రవరి 1: పుల్లూరు నారసింహ క్షేత్రాన్ని సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో జరుగుతున్న పుల్లూరు బండ జాతర చివరి రోజు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బండ పైకి వాహనాలు వెళ్లడం కోసం 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 35 లక్షల టీటీడీ నిధులతో దేవాలయాన్ని పునరుద్ధ్దరింప జేశామన్నారు. 10 లక్షల రూపాయలతో దేవాలయం చుట్టూ షెడ్ నిర్మించినట్లు వివరించారు. బండపై మంచినీటి సమస్యను శాశ్వతంగా దూరం చేయడం కోసం 80 లక్షల రూపాయలతో మంచినీటి ట్యాంకును నిర్మాణం చేశాం.
50 లక్షల రూపాయలతో బండపై కల్యాణ మండపం, సుమారు 20 లక్షల రూపాయలతో సుడా పార్క్ ను ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని ఇచ్చామన్నారు. ఇలా అనేక అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్లో మరిన్ని నిధులు కేటాయించి దేవాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని వివరించారు. పుల్లూరు బండ క్షేత్రాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేసుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క దేవాలయానికి కూడా నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం జలాలతో స్వామి పాదాలు కడుగుతా అని చెప్పి ఆచరణలో చేసి చూపించామన్నారు.