ఆర్థిక వృద్దికి తోడ్పాటు ఇచ్చే చర్యలేవీ ?

కేంద్ర బడ్జెట్‌ ఊరించేలా మాత్రమే ఉంది. కొందరికి వరాలు.. కొందరికి నిరాశ ఎప్పటిలాగే ఉంది. అలాగే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 12 లక్షల వరకు మినహాయింపు చూపినా.. స్లాబుల్లో మాత్రం మళ్లీ కొర్రీలు పెట్టారు. అంటే ఓ చేత్తో ఇవ్వడం..మరో చేత్తో లాగేసుకునే రకంగానే ఉందని అర్థం అవుతోంది. జీతాలు పెరిగినా లాభం లేని పరిస్తితి ఉంది. పిఆర్‌సిలు వేయడం ద్వారా జీతాలు పెరిగినా…ఇన్‌కమ ట్యాక్స్‌ విషయంలో మాత్రం పెద్దగా లబ్ది ఉంటుందా అన్నది ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇకపోతే ద్రవ్యోల్బణం అదుపు చేసి, రూపాయిని నిలబెట్టే ప్రయత్నాలేవీ బడ్జెట్‌ ప్రసంగంలో కానరాలేదు. దీనికితోడు ఆర్థిక సర్వేపైనా దిద్దుబాటు చర్యలు కానరాలేదు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటివన్నీ యధావిధిగానే ఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలకుక్రెడిట్గ్యారెంటీ పెంచడం కొంత ఊతమిచ్చే విషయంగానే చూడాలి. నిజానికి దేశంలో ప్రజల కొరుగోలు శక్తి పెరగాలి. వస్తువుల ధరలు తగ్గాలి. నిత్యవసర వస్తువుల ధరలు దిగిరావాలి.

పెట్రోల్, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గితేనే పేద, మధ్యతరగతి ప్రజలు ఏదైనా కొనగలరు. మార్కెట్లో డబ్బులు చలామణి కావాలి. అందుకు అనుగుణంగా వస్తూత్పత్తి కూడా పెరగాలి. ఆహారధాన్యాల దిగుబడులు పెరగడంతో పాటు,వాటి ఎగుముతుల కూడా ఇతోధికంగా పెరగాలి. అలాగే దేశంలో ఇప్పటికీ పప్పు దినుసులు, వంటనూనెల కొరత అధికంగా ఉంది. ఆ కొరతను అధిగమించేందుకు ఇప్పటికీ భారీ పరిమాణంలో వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. అవసరాన్ని మించి తృణ ధాన్యాలు ఉత్పత్తి చేయడాన్ని నిలువరించి పప్పులు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడం అవసరమన్న విషయం సర్వే తేల్చి చెప్పింది. ఒకపక్క మార్కెట్‌ ధరల్లో ఆటుపోట్ల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావడంతో పాటు మరోపక్క సాధారణ గృహస్థులకు రక్షణ కల్పించే సమాంతర వ్యవస్థ ఒకటి ఉండాలని సూచించింది. ఇక ఎగుమతులు ఉత్తేజితం చేయాలంటే వాణిజ్య సంబంధిత వ్యయాలు తగ్గించేందుకు చర్యలు తీసు కోవాలని తేల్చి చెప్పారు. అప్పుడే భారత్‌ పోటీ సామర్థ్యం పెంచుకోగలుగుతుంది.

దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే అంతంతమాత్రంగానే ఉన్నదన్న విషయం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. మన ఆర్థిక వృద్ధిరేటు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటితో పోల్చితే బలంగానే ఉన్నప్పటికీ దేశీయంగాను, అంతర్జాతీయంగాను పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రధానంగా డాలర్‌తో మారకం విషయంలో రూపాయి విలువ పడిపోతోతోంది. దీంతో దిగుబడులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.3 నుంచి 6.8 శాతం మధ్యన ఉండవచ్చునని అంచనా వేసినా, అందుకు తగ్గట్లుగా చర్యలు ఉండాల్సిందే. దేశంలో శ్రమశక్తిని వినియోగించుకుని వస్తూత్పత్తిని పెంచితే తప్పి ఇది సాధ్యం కాదు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కావాలన్న లక్ష్యం నెరవేరాలంటే ఈ వృద్ధిరేటు ఏ మాత్రం సరిపోదు. ఏడాదికి సగటున ఎనిమిది శాతం వృద్ధిని సాధిస్తే తప్ప మనం ఆ లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదు. గత కొన్నేళ్లుగా ఉన్న సానుకూలతలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి.

అంతర్జాతీయంగా వస్తున్న ఒడిదుడుకుల కారణంగా ఆర్థిక వ్యవస్థల్లో తరచూ మందగమనం ఎదురవుతోంది. ఎగుమతుల రంగం ఎదురీదుతోంది. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం వాటా కేవలం 2 శాతం మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం లో మన ఎగుమతుల వృద్ధిరేటు 1.6 శాతానికే పరిమితం అయింది. ఈ క్రమంలో ప్రపంచంలో మన వాణిజ్య ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగేలా చేయాలి. చైనా వస్తూత్పత్తి రంగంలో ముందుస్థానంలో ఉంది. చైనా వస్తువులు ప్రపంచ మార్కెట్‌ ను శాస్తిస్తున్నాయి. దీంతో చైనా ఆర్థికంగా బలడపడానికి కారణం అవుతోంది. ఇకపోతే దేశీయంగా కొనుగోలు శక్తి పెరిగే ఉద్దీపనలు బడ్జెట్‌లో కానరాలేదు. వేతనజీవులు, మధ్యతరగతి జీవులు సొంతింటి కల నిజం చేసుకునేలా చర్యలు లేవు. ఇలాచేసివుంటే ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువుల ధరలు తగ్గాలి. అలాగేవాటిపై జిఎస్టీ తగ్గాలి. రియల్‌ రంగం పుంజుకుంటే దానితో పెనవేసుకున్న అనేక రంగాలు వృద్దిలోకి వస్తాయి. నిరుద్యోగం బాగా తగ్గుతుంది.

విదేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లయితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెనుభూతంగా ఉంది. గత ఏడాది రుతుపవనాల సానుకూలత కారణంగా గ్రావిూణ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలుశక్తి పెరిగినప్పటికీ నగర జీవులు మాత్రం ధరల కాటుకు విలవిలలాడుతూనే ఉన్నారు. ఫలితంగా వారి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగల రీతిలో వారి వేతనాలు పెరగడంలేదు. ఈ అస్థిరతల నుంచి బయటపడి నిలకడ వృద్ధిరేటు సాధించాలంటే భిన్న రంగాల్లో సంస్కరణలు చేపట్టక తప్పదన్న విషయం ఆర్థిక సర్వే నివేదికలో తేల్చి చెప్పారు. దేశీయంగా వృద్ధికి ఊతం ఇచ్చే రంగాలను ఉత్తేజితం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధానంగా వాణిజ్యం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాల విషయంలో నియంత్రణలు సడలించడం, సుంకాలు హేతుబద్ధం చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నది ఆర్థిక సర్వే సారాంశం.

చిన్నతరహా పరిశ్రమలకు ఇతోధికంగా ప్రోత్సాహకాలు లభించాలి. అలాంటి చర్యలు తీసుకోవడంతో పాటు మితివిూరిన నియంత్రణలను సడలించి పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని సర్వేలో సూచించారు. ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం కావాలంటే మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పెరగాలి. వారి కొనుగోలు శక్తి పెరగాలి. మొత్తం విూద ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి దేశం స్థిరమైన వృద్ధిరేటు సాధించే దిశగా అడుగేయాలంటే సంస్కరణలను ఆశ్రయించక తప్పదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News